27, మే 2020, బుధవారం

న‌గ‌రం మ‌ర‌ల గాడిలో ప‌డింది. క‌రోనాకు భీతిల్లి ఇంట‌నే ఉండిపోవ‌టం సామాన్యుల‌కు సాధ్యంకాదు. పూట గ‌డ‌వాలంటే ప‌నులు చేయాల్సిందే. అందుకే అంత‌టా జ‌నాలు క‌నిపిస్తున్నారు. ఎవ‌రి ప‌నుల మీద వారు వెళుతున్నారు. సాయంత్రం ఆరు త‌రువాత కాస్త ఎక్కువ‌గా జ‌నం సంద‌డి వుంది. ఏడు గంట‌ల‌క‌ల్లా ఇంటికి చేరాల‌నే ఆత్రుత‌నే త‌ప్ప మ‌రో కార‌ణ‌మేమీ లేదు. బ‌య‌ట ఎక్క‌డా హోట‌ళ్ళు లేవు, గుక్కెడు నీళ్ళు దొర‌క‌వు. మ‌నం వెళ్ళిన చోట మంచినీళ్ళు కావాల‌ని అడ‌గ‌లేం.  ఈరోజున ఒక ఆఫీసుకు వెళ్ళా. దాహ‌మేస్తోంది. మంచినీళ్ళు క‌నిపించ‌లేదు. ఎలాగో బ‌య‌టికి వెళుతున్నాం క‌దా అని బ‌య‌టికొచ్చి చూస్తే ప‌క్క‌నే ఉండే ఇరానీ చాయ్ హోట‌ల్ లేదు. మ‌లుపు తిరిగితే క‌ని‌పించే టీ బండి కూడా లేదు. వాట‌ర్ బాటిల్ అమ్మే షాపులూ లేవు. అంద‌రూ తిరుగుతున్న‌ట్టే వుంది. కానీ ఎవ‌రికి వాళ్ళు ఒంట‌రి ద్వీపాల్లా క‌నిపించారు. తిరిగి ఆఫీసుకు వ‌చ్చే వ‌ర‌కు దాహం అంటే ఏమిటో తెలిసింది. నా గురించి నేను ఇలా త‌ల‌పోస్తున్నా స‌రే, కాలిబాట‌న మండే ఎండ‌ల‌లో తిరుగాడే వారు, న‌డిచి వెళ్ళే వంద‌ల‌, వేల మంది సంగ‌తి ఏమిటి? క‌రోనా భ‌యంతో ఇపుడే మా ఇంటికి రావ‌ద్దులే అని మొహ‌మాటం లేకుండా చెప్పేస్తున్న‌వారు క‌నిపిస్తున్నారు. ఒక‌రి ఇంట‌కి వెళ్ళ‌లేరు, వేరొక‌ర‌ని పిల‌వ‌లేరు. భౌతిక దూర‌మే కాదు, మ‌నుషుల మ‌ధ్య ఎడం పెరుగుతోంది. ఈ ఎడం ఎందాకా? ఎంత‌కాలం? ఎంతెంత‌దూరం పెద్ద‌మ్మా కోసెడు దూరం చిన్న‌మ్మా అన్న‌ట్టు ఒక‌రికొక‌రు ఆరు అడుగుల దూర‌మే కాదు, అంద‌నంత దూరం పరుగులెత్తుతున్నారు.
ఒక్కొక్క‌రిలో ఒక్కో ర‌క‌మైన ఆందోళ‌న‌... ఇపుడ స‌రే, రేపు ఎలా అన్న చింత‌న ఎంద‌రిలోనో తారాట్లాడుతున్న‌ది. మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కూడా అంత క్షేమంగా, నిక్షేపంగా ఏమీ లేదు. అమెరికా ఆశ‌లు ఆడియాస‌ల‌య్యాయి.  కెరీర్ గ్రాఫ్‌లో త‌డ‌బాటు పాతికేళ్ళ లోపు వారిలో అల‌జ‌డి రేపింది. స‌గం రోజులే ప‌నిచేయండి. స‌గం జీతం ఇస్తామ‌నే మాట‌లు కొంద‌రికి ఓదార్పు. త‌మ‌కు ఆ మాత్రం ప‌ని కూడా లేదే అని బాధ‌, ఆరాటం... జ‌ర్న‌లిస్టు మిత్రులలోనూ ఎడ‌తెగ‌ని ఆందోళ‌న‌. దిగులు మేఘాలు కమ్ముకున్న ముఖాల‌కు ఏవో న‌వ్వులు పూస్తారే గానీ లోలోప‌ల సుడి తిరిగే దుఃఖం క‌న‌లుతూనే ఉంటుంది. న‌మ్ముకున్న అక్ష‌రం అన్నం పెట్ట‌ద‌ని తెలిసినా పాత్రికేయుల రొద వినిపించే వేదిక‌లు ఉండ‌వు. నింద మోప‌లేరు, ఫిర్యాదు చేయ‌లేరు. త‌మ గురించి తాము చెప్పుకోలేని ఉద్యోగ‌వ‌ర్గం ఏదైనా ఉందంటే అది జ‌ర్న‌లిస్టుల స‌మూహ‌మే. ఈ దేశంలో అత్యంత బ‌ల‌హీన‌మైన సంఘాలు ఏవైనా వున్నాయంటే అవి జ‌ర్న‌లిస్టు సంఘాలే అని ద‌శాబ్దాల కింద‌ట‌నే నా సీనియ‌ర్లు అనేవారు. ఆ మాట ఇప్ప‌టికీ అబ‌ద్ధం కాలేదు. అసంఘ‌టిత రంగాల‌లో ఇది ఒక‌టి. కొంద‌రికి బానే వున్న‌ట్టు వుంటుంది. కానీ అనేకులు నిత్య‌ అభ‌ద్ర‌త మ‌ధ్య‌నే బ‌తుకులు వెళ్ళ‌బుచ్చుతుంటారు. క‌రోనా కాలంలో అభ‌ద్ర‌త తీరుతెన్నులు మ‌రింత‌గా మ‌రింత మంది అనుభ‌వంలోకి వ‌చ్చాయి. చేదు వాస్త‌వాల వెక్కిరింత‌లో ఒక‌రికొక‌రు ఫోన్ల‌లో వ‌ల‌పోసుకోడ‌మే త‌ప్ప ఎవ‌రికీ ఏ భ‌రోసా క‌నిపించ‌దు. క‌రోనా కాలాన కొంద‌రికి కొన్ని నెల‌ల పాటు స‌గం జీతాలే. ఇంకొంద‌రు ఉన్న ఉద్యోగుల నుంచి నిష్ర్క‌మించ‌వ‌లసిన
స్థితి. ఉద్యోగుల లోంచి తొల‌గించ‌వ‌ద్ద‌నే వార్త‌లే కాదు సంపాదకీయాలు కూడా రాస్తాయి ప‌త్రిక‌లు. కానీ త‌మ వ‌ద్ద ఉన్న ఉద్యోగాల నుంచి పంపించే తంత్రం గురించి యోచిస్తారు. ఆ విష‌యం తెలిసినా కిమ్మ‌న‌లేని వారు ఎంద‌రో.
క‌రోనా కాలాన ప‌త్రిక‌ల పాఠ‌కుల క‌న్నా వీక్ష‌కులు పెరిగారు. టీవీల‌ని అతుక్కుపోయే గంట‌ల స‌మ‌యం పెరిగింది. అయినా అక్క‌డ న్యూస్ చానెళ్ళ‌లోనూ బెదురుచూపుల, భ‌యాందోళ‌న‌ల జ‌ర్న‌లిస్టులు ద‌ర్శ‌న‌మిస్తారు. క‌రోనా ధాటిని త‌ట్టుకొని జ‌ర్న‌లిస్టులు కూడా విధులు నిర్వ‌హిస్తున్నార‌ని, వారిని గుర్తించాల‌ని, గౌర‌వించాల‌ని చెబుతారు. గౌర‌వాలు కాదు భ‌ద్ర‌త‌, కాసింత భ‌రోసా కోరుతున్నారు జ‌ర్న‌లిస్టులు. స‌గం జీతాల‌తో అల్లాడుతున్న జ‌ర్న‌లిస్టులు అని ఏ ప‌త్రికా రాయ‌దు. ఏ టీవీ కూడా ప్ర‌సారం చేయ‌దు. ఎంత‌మంది జ‌ర్న‌లిస్టులు రోడ్డున ప‌డ్డారో లెక్క‌లు చెప్ప‌రు.
రెండు నెల‌లుగా జ‌ర్న‌లిస్టు మిత్రులు మాట్లాడుతున్నారు. ఎవ‌రు ఎక్క‌డ ఏం చేస్తున్నారో, ఎపుడు బ‌య‌ట‌కు రావ‌ల‌సి వ‌చ్చిందో చెబుతున్నారు. చిన్న‌పాటి అవ‌కాశం ఎక్క‌డ‌యినా దొరుకుతుందా అని తండ్లాడుతున్నారు. మీడియాలో ప‌నిచేసే రిపోర్ట‌ర్లు, స‌బ్ ఎడిట‌ర్లు, ఆర్టిస్టులు, కార్టూనిస్టులు, ఫొటోగ్రాఫ‌ర్లు, లేఔట్ డిజైన‌ర్లు... ఎన్నో ర‌కాల ప‌నులు చేసేవారు ప‌నుల్లేక అల్లాడుతున్నారు. ఇంటి రుణాలు, ప‌ర్స‌న‌ల్ లోన్స్‌, క్రెడిట్ కార్డు పేమెంట్స్‌, చిరుచిట్టీల వాయిదాలు ఎలా స‌ర్దుబాటు చేసుకోవాలా అని యోచిస్తున్నారు. అయిదు కిలోల బియ్యం, కిలో కందిప‌ప్పు, అర‌కిలో చ‌క్కెర‌,చింత‌పండుతో కూడిన కిట్ల కోసం జ‌ర్న‌లిస్టులు ఎదురు చూడ‌టం లేదు. అవి ఇస్తే కాద‌న‌రు, కానీ కావ‌ల‌సింది ఆర్థిక స‌హాయం... బ్యాంకు ఎకౌంట్ నెంబ‌ర్ తీసుకొని వారికి కొంత మొత్తం డ‌బ్బును బ‌దిలీ చేయ‌డం జ‌ర‌గాలి. ఈ ప‌ని ఎవ‌రు చేస్తారు? ఎవ‌రు చేయాలి? క‌నీసం జ‌న‌వ‌రి 2020 నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఉపాధి కోల్పోయిన జ‌ర్న‌లిస్టుల‌కు తోడ్ప‌డ‌టం అధికారంలో ఉన్న‌వారి విధి, బాధ్య‌త‌. ఈ ప‌ని ఇత‌రులు కూడా చేయ‌వ‌చ్చు.
ఉదాహ‌ర‌ణ‌కు ఫిలిం క్రిటిక్స్ అసోసియేష‌న్ వారు గ‌త రెండు మాసాల్లో ఒక‌సారి అయిదు వేలు, మ‌రోసారి ఎనిమిది వేల రూపాయ‌లు త‌మ స‌భ్యుల అకౌంట్ నెంబ‌ర్ల‌కు న‌గ‌దు బ‌దిలీ చేసింది. ఇలా దాదాపు 90 మందికి వారు ఈ లాక్‌డౌన్ స‌మ‌యాన తోడ్ప‌డ్డారు. జ‌ర్న‌లిస్టు సంఘాల వారు, మీడియా అకాడ‌మీ, ఇత‌ర సంస్థ‌ల వారు ఈర‌క‌మ‌యిన ప‌ని చేయ‌వ‌చ్చు క‌దా. ఎందుకీ ఆలోచ‌న రాదు.  వ‌చ్చినా స్పందించే చొర‌వ ఎందుకు చూప‌రు? ప‌త్రిక‌ల యాజ‌మాన్యాలను అడ‌గ‌లేరు, క‌నీసం ఇలాంటి ప్ర‌యత్నాలు ఎందుకు చేయ‌కూడ‌దు. జ‌ర్న‌లిస్టు మిత్రులు ఈ పూట‌కు బియ్యం లేవ‌ని చింతిల్ల‌డం లేదు. ఇంకా ఇత‌ర అవ‌స‌రాలు ఎన్నో ఉన్నాయి. అవి డ‌బ్బుతో ముడిప‌డిన‌వి. న‌గ‌దు బ‌దిలీ ప‌థ‌కం ఉపాధి కోల్పోయిన జ‌ర్న‌లిస్టుల‌కు కూడా వ‌ర్తింప‌జేయాలి. జ‌ర్న‌లిస్టు సంఘాల నాయ‌కులు, సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు, ఎడిట‌ర్లు ఈ దిశ‌గా చొర‌వ చూప‌లేరా? ప‌్ర‌భుత్వాల‌నో, ప్ర‌యివేటు సంస్థ‌ల‌నో అడ‌గ‌లేరా?
న‌గ‌రం గాడిలో ప‌డింది. మ‌నుషులు మ‌ర‌ల తిరుగాడుతున్నారు. క‌నుక ఉపాది కోల్పోయిన జ‌ర్న‌లిస్టులు ఏ ప‌చ్చ‌ళ్ళ వ్యాపార‌మో ఏదో ఒక‌టి చేయ‌క‌పోరు. (నిరుద్యోగ కాలంలో కె.ఎన్‌.వై. ప‌తంజ‌లి ప‌చ్చ‌ళ్ళ వ్యాపారం చేశాడు.) కానీ క‌రోనాతో జ‌నాలు భీతిల్లే ఈ ప‌రిస్థితిలో టీ కొట్టు కూడా పెట్టలేరు, ప‌చ్చ‌ళ్ళు త‌య‌రు చేసి అమ్మ‌లేరు. న‌మ్మిన అక్ష‌రాల‌ని ఒక తాపు త‌న్ని మ‌రో వృత్తిలో కుదురుకునే వ‌ర‌క‌యినా ప‌ట్టించుకొనేవారు లేరా? 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి