సత్చింతన
అనేకానేక వైరుధ్యాలు, సంక్లిష్టతలు రాజ్యమేలుతున్న కాలమిది. కరోనా విపత్తు నానాటికీ పెరుగుతున్నప్పటికీ మన ఆలోచనల తీరు మారలేదు. వ్యవహారసరళిలో పారదర్శకతకీ, శాస్త్రీయతకీ చోటు కనిపించదు. మరో పదేళ్ళ పాటు కోవిడ్-19 ప్రభావం ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. వ్యాక్సిన్ రేపో మాపో వస్తుందన్న మాటలన్నీ నిరాధారమే. అయినా హేతుబుద్ధితో విధివిధానాల రూపకల్పనకు పాలకులు సిద్ధంగా లేరు. ఫలితంగా భిన్నధ్రువాల నడుమ భారతీయుల ఆలోచనాసరళి అపసవ్యతల నడుమ చిక్కుపడింది. ఈమధ్యన రెండు సంఘటనలు నిశ్శబ్దంగా ఆలోచనల్ని అలుముకుంటున్నాయి. ఓ వైపున అయోధ్యలో రామాలయ నిర్మాణ శంకుస్థాపన నేపథ్యాన హిందూత్వ ప్రచార ఆర్భాటం మీడియాని ఆక్టోపస్లా ఆక్రమించింది. మరోవైపున నూతన విద్యావిధానం పేరిట మహౌన్నతమైన విద్యాసంస్కరణలకు శ్రీకారం చుట్టినట్టుగా కేంద్రం చెప్పుకుంటున్నది.
పౌరుల్లో శాస్త్రీయ చింతనకీ, ఆలోచనాదీప్తికీ పాదులు వేయాల్సిన పాలకులే రామాలయ నిర్మాణం విధిగా భావించడం ఒక అభాస. రాముని దీవెనలతోనే సమస్త భారతం శాంతి సౌభాగ్యాలతో వర్థిల్లుతుందని నమ్మబలకడం దుర్మార్గ తర్కం. రామాలయ నిర్మాణంపై ఎనలేని ఉత్సాహం చూపించే వారే విద్యావిధానంలో పెనుమార్పులు చేపడుతున్నామని చెప్పడం విరోధాభాస. ఈ రెండూ పకడ్బందీ కుతంత్రాలే. రామాలయం శంకుస్థాపన రోజు ఇంటింటా పూజలు చేయాలని చెప్పడంలో హేతుబద్ధత ఎక్కడ? అలాగే పాఠశాలల్లోని అన్ని స్థాయిల్లో సంస్కృతాన్ని ఐచ్ఛిక భాషగా ప్రవేశపెట్టడంలో ప్రామాణికత ఏమిటి? సంస్కృతం, పాళీ, ప్రాకృతం భాషలని పాఠశాల స్థాయి నుంచి నేర్చుకునే అవకాశం కల్పించడానికి ప్రాతిపదిక ఏమిటి?
ప్రజల మానసిక ప్రపంచాలతో చెరలాటలాడే కుట్రపూరిత వ్యూహాల పెనుదాడి కోవిడ్-19 విపత్తు కాలంలోనూ ఆగలేదు. లౌకిక చింతన, శాస్త్రీయ వివేచనలకు ఆస్కారం లేకపోవడం ఈ కాలపు విషాదం. యావత్ ప్రపంచంలో అనేకానేక రంగాలకు సంబంధించిన పునర్విశ్లేషణలు జరుగుతున్నాయి. పునర్నిర్మాణాలతో సరికొత్త జీవనసరళికి సమాయత్తమవుతున్నాయి. దీనికి భిన్నంగా తిరోగమనపుటాలోచనలు ఈ జాతికి శోభనిస్తాయా? ఈ దేశ భవితవ్యానికి దిశానిర్దేశం చేస్తాయా? అయోధ్యలో రామాలయ నిర్మాణంతో శ్రేయోరాజ్యం సిద్ధిస్తుందా? ఒక ఎం.పి. చెప్పినట్టు రామనామ జపంతో, మంగళహారతులతో కరోనా తొలగిపోతుందా? ఈ ప్రశ్నల్ని సంధించాల్సిన మీడియా కాషాయశక్తుల వందిమాగధుల దళంగా పరిణమించింది.
ఈ నిర్హేతుక, నిరర్ధక భజన బృందాలే నూతన విద్యావిధానాన్ని వేనోళ్ళ కీర్తించడం విడ్డూరం. నిజానికి దీనిలో నూతనత్వమన్నది లేశమాత్రమైనా లేదు. భారతీయ విలువల పేరిట కాలం చెల్లిన, తర్కరహిత, హేతువిరుద్ధ కట్టుకథల్ని పాఠ్యప్రణాళికల్లో బోధించే ప్రమాదం లేకపోలేదు. అంతేగాక విద్యారంగంలో ప్రైవేటు శక్తుల దూకుడు గురించి ఈ విధానం మౌనం వహించింది. మూడు సంవత్సరాల అంగన్వాడీ లేదా ప్రీ స్కూల్తో మొత్తం 12 సంవత్సరాల పాఠశాల విద్య ఉంటుందన్నది ఈ విధానం. ఈ పన్నెండు సంవత్సరాల విద్యలో ప్రైవేటు శక్తులకు, కార్పోరేట్ బేహారులకు చోటు లేని విధానం రూపొందించే సంకల్పం దీనిలో కనిపించదు.
ప్రీ స్కూల్ నుంచి పిజి వరకు చదువుకోవాలనుకునే ప్రతి పౌరునికి ఉచితంగా విద్యని అందించడం ప్రభుత్వాల కర్తవ్యం. దీనిని పక్కన పెట్టి ఎన్ని మాటలు చెప్పినా వ్యర్థం. ఇపుడు ప్రకటించిన విధానంలో వృత్తి విద్యాకోర్సులకు ప్రాధాన్యమిచ్చినట్టు కనిపిస్తుంది. కానీ అది కూడా పేదల్ని, బడుగు బలహీన వర్గాల వారిని ఉన్నత విద్యకు దూరం చేసే కుటిలత్వం. వృత్తివిద్యాకోర్సులు ఏవో చదివి చిన్నచితకా ఉద్యోగాలకు పరిమితమయ్యే అనేకులు ఉన్నతచదువులకు దూరమవుతారు. ఫలితంగా డబ్బులున్న మారాజుల పిల్లలకే ఉన్నత చదువులనే రీతి నిశ్శబ్దంగా ఆమోదం పొందబోతున్నది.
నూతనత్వం, ప్రాంతీయ భాషల ప్రోత్సాహం, సాంకేతిక విద్యా ప్రావీణ్యాల పెంపుదల అనే సొగసయిన పదాలతో విద్యారంగాన్ని భారీ వాణిజ్యంగా రూపుదిద్దే కుట్రకు తెరదీసింది కాషాయ ప్రభుత్వం. దీన్ని గుర్తించకుండా మాతృభాషలకు ప్రాధాన్యం ఇచ్చిందని మురిసిపోవడం అర్థరహితం. 1986లో ప్రకటించిన నూతన విద్యావిధానానికీ, ఇపుడు 2020లో ప్రకటించిన నూతన విద్యావిధానానికీ సారాంశంలో తేడా లేదు. ఆనాడు విద్యారంగంలో ప్రైవేటుశక్తులకు ద్వారాలు తెరిస్తే, ఇవాళ డిజిటల్ విద్య పేరున కార్పోరేట్శక్తుల గుత్తాధిపత్యాన్ని స్థిరీకరించే మహామేయ కుట్రకు తెరదీశారు. మతశక్తుల, మార్కెట్శక్తుల కలయిక ఫలితంగా ఆలోచనల్ని ఉత్తరించే దాష్టీకం పెట్రేగనున్నది.
విరుద్ధశక్తుల సంఘర్షణ అనివార్యం. కానీ పరస్పర ప్రయోజనాలున్న అధికార వర్గాలకీ, మార్కెట్శక్తులకీ నడుమ వైరుధ్యం ఏమీ లేదు. ఆ రెంటీ నడుమ ఇదివరకు కనిపించని రేఖలుండేవి. అవి చెదిరిపోయిన సందర్భం ఇవాళ్టి చేదు నిజం. మార్కెట్ల లాభాలకు అనుగుణంగానే సకలరంగాల్ని 'చక్కదిద్దే' పనికి పరిమితమవడం అధికారంలో ఉన్నవారి విధి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, సర్వోన్నత న్యాయస్థానాల తీరుతెన్నులన్నీ ఈ పరిధిలోనే తచ్చాడు తున్నాయి. ఈ పరిధి సహజమూ, సక్రమమూ, ఆమోదనీయమూ అని నమ్మించేందుకు విద్యావ్యవస్థ కొత్త మోసులెత్తుతున్నది. అది కోట్లకు పడగలెత్తే కుబేరుల ప్రాథమ్యాలకు అనుగుణంగానే ఉన్నది. నూతన విద్యావిధానంపై కార్పోరేట్ల స్వాగత వచనాలే ఇందుకు దాఖలా. ఈ నేపథ్యంలో నిజానిజాల్ని విశ్లేషించగలిగిన వారు అందమైన పదాల గారడీలో కొట్టుకుపోకుండా నోరు విప్పాలి. కరోనా విజృంభణలోనూ జనహితం పట్టని పాలకగణాల కుతంత్రాల్ని విప్పిచెప్పాలి. శాస్త్రీయ వివేచనకీ, ఆలోచనకీ తావునివ్వని విధానాల మర్మం వివరించాలి. త్రికరణశుద్ధిగా జనపక్షం నిలిచిన విద్యారంగ నిపుణుల కర్తవ్యమిది.
నవతెలంగాణ ఎడిటోరియల్, 02 ఆగస్టు 2020